ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, మే 2010, శుక్రవారం

జిహాద్ అంటే ధర్మపోరాటం

జిహాద్ అంటే ధర్మపోరాటం, న్యాయంకోసం పోరాటం అని అర్ధం.తీవ్రవాదులు ఉగ్రవాదులు హింసకు పాల్పడే అరాచకవాదులు తమ దుర్మార్గపు పనులను కూడా జిహాద్ అనే పిలుస్తున్నందువలన ఇంత మంచి పదం చెడ్డదైపోయింది.
జిహాద్ లు రెండు రకాలు
1. జిహాద్-ఎ-కుబ్రా
మనలోని మంచి చెడుల మధ్య జరిగే అంతర్గతపోరాటం
2. జిహాద్-ఎ-సొగ్రా
మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం.

న్యాయాన్ని అమలు చేయడం. చెడును ఆపటం రెండూ జిహాదే. చెడును చేతితో ఆపగలిగితే ఆపు. చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు. నోటితోకుడా ఆపలేకపోతే మనసులోనైనా చెడుపనిని అసహ్యించుకో అని ప్రవక్త చెప్పారు.
*మంచిని ఆపుతూ దుష్టులు జిహాద్ అని అరవటం వల్ల ఈ పదం అభాసుపాలయ్యింది.సూర్యకాంతం మంచిపేరే అయినా గయ్యాళి అనే అర్ధం ఎలా వచ్చిందో ఇదికూడా అంతే.దేవదాసు అనే పేరుకూడా సారాయిదాసు లా జిహాద్ అంటరాని దయ్యంలా అయ్యింది.
*అల్‌ఖైదాలో చేరటం ఇస్లాంకు విరుద్ధం.నిషిద్ధ 'తక్‌ఫిరిజమ్‌' సిద్ధాంతాన్ని అల్‌ఖైదా అనుసరిస్తోంది.అల్‌ఖైదాతో సంబంధం పెట్టుకోవటం ఇస్లాం బోధనల ప్రకారం నిషిద్ధం.---- సౌదీ మతాచార్యులు,రాజ దర్భారులో సలహాదారు షేక్‌ అబ్దుల్‌ మోహ్‌సెన్‌ అల్‌-ఒబీకాన్‌.(ఈనాడు 14.1.2010)
*ఇరుపక్షాల వాళ్ళూ తమది ధర్మయుద్ధం ( జిహాద్ ) అనే అనుకుంటారు.దేవతలు రాక్షసులు ధర్మం తమ పక్షానే ఉందని చెబుతూ యుద్ధం చేసుకున్నారు.అసలు నరహత్యలు హింసతో కూడిన యుద్ధం అనేదే అధర్మం.అహింస పరమ ధర్మం కాబట్టి అహింస తో కూడిన యుద్ధమే ధర్మయుద్ధం ( జిహాద్ ) అవుతుంది. ఉదాహరణకు గాంధీ గారు నడిపిన స్వాతంత్రోధ్యమం సత్యాగ్రహం నిరాహారదీక్షలు,బుద్ధుడు,ఏసు చేసిన అహింసాయుత పోరాటాలన్నీ ధర్మపోరాటాలు (జిహాద్ )లు.అంతే కానీ పవిత్ర యుద్ధం పేరుతో హింసకు పాల్పడి తోటి అమాయక సోదరులను చంపి అల్లా శాంతిస్తాడని,అది అల్లా యొక్క పని అని చెప్పటం మహా పాపం.
*నరబలితో ఏ దేవుడూ శాంతించడు.ఇంకా పాపం చుట్టుకుంటుంది.క్షుద్రదేవతలు కూడా రాను రాను శాఖాహారం వైపే మళ్ళాయి.ఇలాంటి ముష్కరులు ఏ మతంలో ఉన్నా రాక్షసత్వం వదిలి మానవత్వాన్ని పెంచుకోవాలి.లేకపోతే కసబ్ కు పట్టిన గతే పడుతుంది.ప్రజాస్వామ్యయుగంలో హంతకుల్ని మతం రక్షించలేదు.

బాసరాని సాయిబులు

బాసరాని సాయిబులు
గీటురాయి వారపత్రిక 30.4.2004
దూదేకుల సిధ్ధప్ప (బ్రహ్మం గారి శిష్యుల్లో మహాజ్ఞాని)కి దూదేకను రాదంటే లోటా? అని సామెత. ఆయనకి దూదేకటం రాకపోయినా ఆయన గురువుగారి కాలజ్ఞాన తత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడూ కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు(కంసాలీలు/విశ్వబ్రాహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ బాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసం దాన్నొక లోటుగా కూడా ఎంచలేదు.ఆయన మాత్రం "ముట్టున బుట్టిందీ కులము, ముట్టంటున పెరిగిందీ కులము" అని తెలుగు తత్వాలే పాడాడు.

లింగి పెళ్ళి మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు పెట్టుకొని సంఘంలోకెళితే,అసలు సిసలు సాయిబు(ఉర్దూ జబర్దస్తీగా మాట్లాడే మహారాజు) ఎదురైనపుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది.ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా పోతున్నారు మీరు అని అసలు సాయిబులు ఆవేదన చెందుతూ ఉంటారు.ఆకారం చూచి ఆశపడ్డామేగాని అయ్యకు అందులో పసలేదని చప్పడిస్తుంటారు.బాష వేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖాన అంటావు. నేను అన్నం అంటాను అంటాడు. ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదై పోతాడు.

ఇటీవల "పింజారీ వెధవ" అనే తిట్టు టీ.వీ. సీరియళ్ళలో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది. బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల "పింజారి" అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో బాధపడుతున్న సంభాషణా రచయితలున్నారు. "ఓరీ రజక చక్రవర్తీ" అంటే - ఇంత పెద్ద పేరు మాకందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట. అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. "ఎస్సీ,ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం" వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు. ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడల్లాగా వాళ్ళు కూడా మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూడటమే మిగతా వారి వంతయ్యింది. ఐతే ఆ తోకలతో పిలవచ్చా పిలువ కూడదా, పిలిస్తే ఏమవుతుందో అనే భయంతో మిన్నకున్నారు. ఒకనాడు అవమాన సూచికగా, తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్దార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించుకుంటుంది. అలాగే బాసరాని పింజారులు కృంగిపోవద్దు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ పవిత్రమైన ఆశయాలతో కృషి చేస్తే, పది మందికి వెలుగు చూపే చక్రవర్తులుగా "నూర్ బాషా"లు(కాంతిరాజులు) గా మన్నన పొందుతారు.--- గీటురాయి వారపత్రిక 30.4.2004.

ఈదేశానికి పట్టిన చీడ కులం.మాటవరసకు ఒకవేళ కులం జన్మనుబట్టే వస్తుందనుకుందాం.దూదేకులవాళ్ళు వచ్చేజన్మలో ఇంకో కులంలో పుట్టొచ్చు.అనేక కులాల వాళ్ళు దూదేకులుగానూ పుట్టొచ్చు.ఇన్ని జన్మల క్రమంలో కులదూషణకు,ఎగతాళికి పాల్పడినందుకు ఎన్ని వేలమంది జంధ్యాలలు పింజారులుగా పుట్టి ఉంటారో?.అలాగే ఎన్ని వేలమంది పింజారులు అగ్రకులాల్లో పుట్టి ఉంటారో?సంఘమిలా ఏనాడో సంకరమైపోయిఉన్నా కూడా దౌర్భాగ్యం ఏంటంటే భారతీయుడు ఏ మతంలోకి వెళ్ళినా కులం ఉంటున్నది.భారతీయ క్రైస్తవుల్లో,ముస్లిముల్లో కూడా కులాలున్నాయి.అగ్ర కుల ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వకపోయినా షేక్ ల రూపంలో దొంగదారిన రిజర్వేషన్ పొందుతున్నారు.పేదరికమే ఈ కక్కుర్తికి కారణం.రిజర్వేషన్ ఇచ్చిన 14 కులాలూ నికృష్టంగానే ఉన్నాయి.అసలు దూదేకుల వాళ్ళ మాట ఎక్కడ చెలామణి అవుతుంది?ఈరాష్ట్రంలో దూదేకుల వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.బి.సి.ఇ గ్రూపులో దూదేకుల కులస్తులను కలపలేదు.వాళ్ళు బి గ్రూపులో ఉన్నారుగా అని వదిలేశారు.అధికారులు కూడా కొన్నిప్రాంతాల్లో మతం హిందూ అనీ, కులం దూదేకుల అని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇస్లాం-దూదేకుల అని సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. మసీదుకు వెళ్ళము అని అఫిడవిట్ దాఖలు చెయ్యాలని ఆంక్షలు పెడుతున్నారు. తల్లిదండ్రులు దూదేకుల వృత్తి చేస్తుంటేనే బీసీ సర్టిఫికెట్‌ ఇస్తామని చెబుతున్నారు.రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కాలంలో అసెంబ్లెలోనే విన్నవించింది.అంటే దూదేకుల వారిని ముస్లిములు దళితులుగా భావిస్తున్నట్లేగా?

ఆ మధ్య ఓ కాపులామెను ఇంట్లో పిండి దంచటానికి రమ్మంటే తురకోళ్ళ ఇంట్లో పని చెయ్యనని తిరస్కరించింది. సరే, కూలి పని చేసుకునే ఈ కాపులామె దృష్టిలో తురకసాయిబులు సంపన్నులైనా అంటరాని వాళ్ళు కాబోలులే అనుకొని అవసరం మరొకరి చేత తీర్చుకున్నాం. ఇంకోచోట అప్పటిదాకా సాలీలకు అంట్లుతోమిన ఓ తురకసాయిబులామె మాకు తోమను పొమ్మంది. మేము తక్కువ రకం సాయిబుల మట. మా ఇంట్లో కూలిపని చెయ్యటం తప్పట! ఆయనగారు జిల్లా కలెక్టర్ అయినా సరే వాళ్ళిచ్చే కూలీ నా కొద్దు చాకలోళ్ళ ఇంట్లో అయినా పని చేస్తాను గానీ దూదేకుల వాళ్ళింట్లోపని చెయ్యను అని తెగేసి చెప్పింది. సరే, ఇక చేసేదేముంది? మా పనులు మేమే చేసుకుంటున్నాం. ఉర్దూ రాని దూదేకుల వాళ్ళ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా వుంది.రజక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య, చాకలి వాళ్ళు తన ఇంట్లో బట్టలు ఉతకటానికి నిరాకరించారని గతంలో వాపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఇది స్వంతకులంలోనే అంతర్గత సమస్య.పరిస్థితి ఇలా ఉంది. తల పండిన పెద్దలు, పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

కొన్నేళ్ళక్రితం  మా అపార్ట్ మెంట్లోకి ఒక సాయిబుల కుటుంబం చేరింది.మాది పొదిలి అంటూ మంచిగా మా ఆవిడను పరిచయం చేసుకుంది. మాయింటి పేరు నూర్ బాషా అని తెలియగానే ఆవిడ ముఖం రంగు మారి పోయింది.”వాళ్ళు వేరు మేము వేరు ” అని పని గట్టుకొని అందరికీ చెప్పింది.”ఇద్దరూ సాయిబులేగా” అంటే “కాదు మేము తురకసాయిబులం వాళ్ళు దూదేకుల సాయిబులు, వాళ్ళకు ఉర్దూ రాదు మాకు ఉర్దూ వచ్చు, వాళ్ళకు మాకు చాలా తేడా వుంది” అని చెప్పిందట.విశాఖపట్నంలో ఇంత నాగరికత గల ఊళ్ళో ఈనాడు ఈ కుల ఫీలింగ్ ఉండదు అన్న నాభావన కరిగిపోయింది.ఆవిడ కొడుకు ఒక డాక్టర్ .కేరళ క్రిస్టి యన్ నర్సును ఆదర్శ వివాహం చేసుకొన్నాడు.ఆయనకు లేని కులం పట్టింపు ఈమెకుంది.పక్క అపార్ట్ మెంట్ లోని సాయిబులామె అప్యాయంగా కలుపుకొని పలకరిస్తుంటే ,ఈమె కులం కోసం బిగుసుకు పోతుందేమిటీ? ఈమెకేమయ్యిందీ?అనుకునేవాళ్ళం.
కొన్ని రోజుల క్రితం చీరాల నుండి మా చుట్టాల్లో ఒకామె వచ్చింది.ఇద్దరూ చాలా సేపు ఆప్యాయంగా ఉర్దూలో మాట్లాడుకున్నారు.చివరికి మా చుట్టం “పొదిలావిడ మన కులమే .ఆవిడ మాకు చుట్టం” అని తేల్చింది.
అరెరే, మాకులం దానివై వుండీ,క్రిస్టియన్ కోడలిని పెట్టుకొనీ ,తురక సాయిబులమంటూ ఎంత పోజు కొట్టావే ముసలమ్మా అనుకొన్నాం.ఈ చేదు అనుభవాలను చాలా మంది ఎదుర్కొని ఉంటారు. నేటికీ సమాజంలో కొనసాగుతున్న ఈ రుగ్మతల పట్ల సంఘ సంస్కర్తలు శ్రద్ధ చూపడం అవసరం. 

దూదేకుల సాయిబులను కూడా ముస్లిములుగా అంగీకరించటానికి ఉర్దూసాయిబులు  క్రమంగా అంగీకరిస్తున్నారు.ముస్లిం అనే పదం అల్లాను దేవునిగా అంగీకరించిన వారందరికీ సమానంగా వర్తిస్తుంది కానీ ఆంధ్రాలో ముస్లిం అంటే తురకం రావటమే ప్రధాన అర్హత అన్నట్లుగా పరిస్థితి ఉంది.ఏలూరు దగ్గర తంగెళ్ళమూడిలో తురకసాయిబులు తివాచీలు నేస్తారు.అక్కడికి ఓ ముస్లిం మిత్రునితో కలిసి వెళ్ళాను.అప్పటిదాకా ఎంతో ఆప్యాయతగా మాట్లాడిన ఓ తివాచీల పెద్దాయన నేను దూదేకుల ,నూర్ బాషా అని తెలియగానే నన్ను  అంటరాని కులం వాడిలాగా చూడడం మొదలుపెట్టాడు.నన్ను అక్కడకు తీసికెళ్ళిన మిత్రుడు అతని ప్రవర్తనచూసి బాధపడి నాకు క్షమాపణ చెప్పాడు.

దూదేకుల సాహెబుకు రైల్లో ప్రయాణించేటప్పుడుకుడా నమాజు చేసేంత భక్తి ఉండటంలేదని తురక సాయిబులకు అసంత్రుప్తి.ఇస్లాం విశ్వాసాలనూ హిందూ విశ్వాసాలనూ  ఒకేరీతిగా చూస్తాడనీ ,హిందువులాగా బొమ్మలకీ..రాళ్ళకీ రప్పలకీ కూడా మొక్కుతాడనీ బాధపడతాడు,విమర్శిస్తాడు.ఫలితంగా 'సాహెబ్' అనే గౌరవనామానికి తురకమొచ్చిన సాయిబులే తప్ప తెలుగు మాత్రమే వచ్చిన దూదేకుల సాయిబులు పనికిరావటం లేదు.ఇనగంటి దావూద్ గారు నూర్ బాషీయుల చరిత్ర రాసి కొంత మేలుకొలిపారు. తెలుగుముస్లిం అనే వాదం బలపడ్డాకనే దూదేకులకు ఉర్దూ సాయిబుల్లో కొంత గుర్తింపు వచ్చింది. అంతర్గత వివక్ష పోయేందుకు ఇరుపక్షాలు కృషిచెయ్యాలి.
ఉర్దూవచ్చినవాడే సాహెబు అనే స్థితినుండి ఇస్లాంను తెలుగులోకి తరలివచ్చేలా చేసిన తెలుగువాడు దూదేకుల సాహెబు.ఉర్దూ భాషరాదనే ఈసడింపులను సహించాడు.మసీదులోకి తెలుగును తీసికెళ్ళాడు.అందుకే అతను తెలుగు ముస్లిం అయ్యాడు.ఇతన్ని బాసరాని సాయిబుగా విడదీసి చూస్తారు.వీళ్ళని మంచి ముస్లిములుగా చెయ్యాలని ముస్లిం సంస్థలు కృషి చేస్తుంటే,ఇన్నాళ్ళూ అద్దె ఇళ్ళలో ఉన్నారు తిరిగి మీసొంత ఇంటికి రండి అని హిందూ సంస్థలు పిలుపునిస్తున్నాయి.

ఫత్వాలను ఎంతమంది పాటిస్తారు?



మంచికోసం మనుషులు కదులుతారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే పనులను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు. ఫత్వాలు ముఫ్తీలు,ఉలేమాలు ప్రకటిస్తారు.అవి మంచిగా ఉంటే అంగీకరిస్తారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే ఫత్వాలను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో అభివృధ్ధివాదం,మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది. ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్ లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని మతపెద్దలు ఎంతగా చెప్పినా వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో లక్షలాది ముస్లింలు పాతుకుపోయారు.భారతరత్నలు కూడా అయ్యారు.అన్నిరకాల జనాన్ని మతం కలుపుకుపోక తప్పదు.ప్రజల సుఖ శాంతుల కోసం మతంలో నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉండాలి.
నిరసనలు ఎదుర్కొన్న కొన్ని‌ ఫత్వాలు:
*బ్యాంకుల్లో పనిచేయడం ఇస్లాంకు వ్యతిరేకం.
*వడ్డీ, జూదం ఆధారంగా రూపొందినందువల్ల బీమా పాలసీలు ఇస్లాంకు వ్యతిరేకం.
*ముస్లిం మహిళలు న్యాయమూర్తి పదవి చేపట్టడం నిషిద్ధం.
*పెళ్ళికి ముందే వీధుల్లో షికార్లు చేసిన ఒక ప్రేమ జంట పెళ్ళికి కూడా ముస్లిములెవరూ వెళ్ళొద్దు.
*వందేమాతరం గీతంలోని కొన్ని పంక్తులు ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ పాటను ముస్లింలు పాడకూడదు.
*ఫేస్  బుక్కు,ట్విట్టర్ లలో మహిళలు చేరకూడదు.వాటిలో ఫొటోలు పెట్టకూడదు
కొన్ని మంచి ఫత్వాలు
*ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం.ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదు. ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉంది.(జమీయతుల్ ఉలమాయె హింద్ దేవబంద్ )
*కర్ఫ్యూ సమయంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి.

ఫత్వా అంటే ఆజ్ఞ కాదు. మార్గదర్శకాలు మాత్రమే:
దారుల్‌ ఉలుమ్‌ సంస్థ వందేమాతరం ఇస్లాంకి వ్యతిరేకమంటూ 2006లోనే ఫత్వా జారీచేసింది.జమాతే-ఉల్‌మా-ఇ-హింద్‌ జారీ చేసిన ఫత్వాను వ్యతిరేకిస్తూ ముస్లింల ఆధ్వర్యంలో ఇక్కడ ఓ మసీదు ముందు వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలతోపాటు పలువురు మతస్థులు పాల్గొన్నారు. వందేమాతరం పాడడం... ఇస్లాంను వ్యతిరేకించినట్టు కాదు అని రజిక్‌ అన్నారు. తొలుత ఓ దేవాలయం ముందు ఆలపించి అనంతరం 'రుక్మిణి బాలాజీ మందిర్‌' ఆధ్వర్యంలో కొందరు ర్యాలీగా బజార్‌ చౌక్‌ వచ్చారు. అయితే మసీదు ముందు కూడా వందేమాతరం పాడాలని వారిని రజిక్‌ కోరారు. ఈ నేపథ్యంలో తమతో కల్సి వందేమాతరం పాడాలని రజిక్‌ పలువురిని అభ్యర్థించారు.ఫత్వా అంటే ఆజ్ఞ కాదు. మార్గదర్శకాలు మాత్రమే. ప్రజలు ఫత్వాకు కట్టుబడి ఉండొచ్చు లేదా ఉపేక్షించవచ్చు అని దారుల్‌ ఉలుమ్‌ ఉప కులపతి మౌలానా అబ్దుల్‌ ఖలిక్‌ మదర్సి అన్నారు.(ఈనాడు10.11.2009)

*ఫత్వాలు నన్ను ప్రభావితం చేయలేవు: ఖుర్షీద్‌
ముస్లింలు బీమా పాలసీలకు దూరంగా ఉండాలని మతపెద్దలు ఫత్వా జారీ చేయటంపై కేంద్ర మైనార్టీ వ్యవహారశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఘాటుగా స్పందించారు. ఓ ముస్లింగా ఇలాంటి ఆజ్ఞలు తనను ప్రభావితం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. 'నాకు కూడా బీమా పాలసీలున్నాయి. బ్యాంకింగ్‌ విధానం వల్ల లబ్ది పొందాను' అని ఖుర్షీద్‌తెలిపారు.(ఈనాడు 16.5.2010)

ఆంధ్ర జ్యోతి 26.9.2015 

(ఈనాడు 25.2.2016)
 

బైబిల్ లోని అద్వితీయ దేవుడెవరు?

దేవుడు "అద్వితీయుడు" అని ఇస్లాం చెబుతోంది. ఖురాన్ కంటే ముందు దేవుడు వివిధ ప్రవక్తల ద్వారా పంపిన పూర్వ గ్రంథాలు చాలా వరకు బైబిలులో ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా బైబిలును తరచి పరిశీలించి చూచాను. మరి ఆ అపూర్వ గ్రంధం కూడా " దేవుడు ఒక్కడే" నని ఘోషిస్తున్నది. క్రైస్తవ సోదరులతో పాటు ముస్లిములు కూడా ఈ దైవ వాక్యాన్ని తెలిసికోవటం అవసరం.
అపోస్తలుడైన పోలు తిమోతీకి వ్రాసిన లేఖలో ఇలా అంటాడు: " సకల యుగములలో రాజైయిండి, అక్షయుడును, అదృశ్యుడునగు, 'అద్వితీయ దేవునికి' ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్"(1 తిమోతీ 1:17).
ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఒక శాస్త్రి ఏసుక్రీస్తును అడుగుతాడు. అందుకు ఏసు - " ప్రధానమైనది ఏదనగా - ఓ ఇస్రాయేలు వినుము: మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే ప్రధానమైన ఆజ్ఞ” అంటాడు. ఆ శాస్త్రి "బోధకుడా, బాగా చెప్పావు. ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడులేడని నీవు చెప్పిన మాట సత్యమే" అంటాడు. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని ఏసు గ్రహింఛి 'నీవు దేవుని రాజ్యమునకు దూరస్థుడవు కావు" అని అతనితో అంటాడు. (మార్కు 12:28-34)
అంటే దేవుడు ఒక్కడేనని ఆయననే ఆరాధించాలని గ్రహించిన వాళ్ళు దేవుని రాజ్యానికి దూరస్థులు కారని ఏసుక్రీస్తు వారి భావం అయితే ఒక్కడైన ఆ దేవుడు ఎవరు? నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని దేవుడు మోషేతో చెప్పెను' అంటాడు యేసు. (మార్కు 12:26)
మరి ఈ అబ్రాహాము దేవుడు ఏసుక్రీస్తుకు కూడా దేవుడేనా లేక ఏసుక్రీస్తే దేవుడా? ఇంతకు ముందే యేసు చెప్పాడుగదా 'మనదేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు (మార్కు:12:29).
ఆయన మగ్ద లేనే మరియకు చెబుతాడు "నా సహోదరుల యొద్దకు వెళ్ళి -- నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను"(యోహాను 20:17).
ఈ అద్వితీయ దేవుడు ఏసుక్రీస్తుకు కూడా దేవుడేనని స్పస్టమయ్యింది. అయితే దేవుడు ఆయనకు తండ్రా? ఆయన ఒక్కడికే కాదు మనకు కూడా తండ్రియే. ఎలా? " నా తండ్రియు మీ తండ్రియు" (యోహాను 20:17).
తండ్రి అంటే కుటుంబానికి శిరస్సు, యజమాని, పోషకుడు, సంరక్షకుడు తండ్రికి తన బిడ్డలపట్ల అపారమైన ప్రేమ ఉంటుంది. వారు తప్పుచేస్తే ప్రేమతో కూడిన కోపం వస్తుంది పిల్లలు చెడిపోతే తండ్రికంటే మరెవరు ఎక్కువ బాధ పడతారు? పిల్లలు తను చెప్పిన బాటలోనే నడుస్తుంటే తండ్రికి ఎంత ఆనందం? ఏసు - " దేవుడు తన తండ్రి" అని చెప్పుకోవటం ద్వారా ఆ దేవుని పట్ల బిడ్డలాంటి భక్తిని ప్రేమను చూపించాడు. అంతేగాని స్వయంగా దేవుడు తన తల్లిని భార్యగా చేసికొన్నట్లు, శారీరక సంబంధంతో తనను కనినట్లుగా ఆయన చెప్పలేదు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మకు జన్మించిన ఏసు తన తండ్రిగా ఇంకెవరిని చెప్పుకోవాలి? ఆయన రూహుల్లాహ్!
అయితే యూదుల దృష్టిలో " ఈ మాటే" పెద్ద పాపంలా కనబడింది. పిలాతు ఏసులో ఏ నేరమూ కనుక్కోలేకపోతాడు. అప్పుడు యూదులు - "మాకొక నియమము కలదు. తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను" అనిరి.(యోహాను 19:7).
ఆ నియమం ఏమిటి? "యోహోవా నామమును దూషించు వాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్ళతో అట్టి వానిని చావగొట్టవలెను"(తేలీ 24:16) ఇది మోషే ధర్మశాస్త్రం ద్వారా యూదులకు ఇవ్వబడిన నియమం. అయితే ఏసుదేవుని దూషించాడా? దూషించటం అంటే తిట్టనక్కరలేదు. 'దేవుడు నా తండ్రి' అని చెబితే దేవుడ్ని దూషించినట్లే యూదులు భావించే వారు.అది ఎలాగ? చూడండి: "ఏసు షబ్బాతు దినాచారాన్ని మీరుట మాత్రమేగాక, దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి"(యోహాను 5:18)
చూచారా? మోషే ధర్మశాస్త్రానికి యూదులు ఎలాంటి గతి పట్టించారో! వారు ఆ ధర్మ శాస్త్రాన్ని ఖచ్చితంగా అమల చేసే వారయితే వారే ఏసును చంపవలసింది. పిలాతు దగ్గరకు ఎందుకు తీసి కెళ్ళారు? మీరతన్ని తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చండి అని పిలాతు యూదులతో చెబుతాడు. అందుకు యూదులు- "ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదు" అని అంటారు. (యోహాను 18:31,32). ధర్మశాస్త్రాన్ని వక్రీకరించిన మాయావులు యూదులు. అయితే ఏసు తన తల్లి ఫలానా అని చెప్పుకోగలడు. తన తండ్రి ఎవరని చెప్పుకోవాలి? యూదుల సంకుచిత దృష్టిలో ఇదే మరణ శిక్షకు తగినంత నేరం అయ్యంది. "అందుకు ఏసు-మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి యుండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదుగదా! వారే దైవములని చెప్పిన ఎడల- నేను దేవుని కుమారుడనని ఛెప్పినందుకు,తండ్రి ప్రతిష్టచేసి ఈ లోకములోనికి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నానని చెప్పుదురా? అనెను"(యోహాను 10:34-36)
కేవలం శారీరక దృష్టితో ఆలోచించేవారికి ఆత్మీయ విషయాలు అర్ధంకావు. ఏసు దేవుడ్ని తనకు ఏలాంటి తండ్రిగా భావించాడు? "నా తండ్రి అందరి కంటే గొప్ప వాడు" "తండ్రి నా కంటే గొప్ప వాడు” (యోహాను 10:29;14:28) ఎంత గొప్పవాడు? "ఆయన నా తండ్రి. నా దేవుడు". (యోహాను 20:17). ఏసు దేవునికి ఇలా ప్రార్ధిస్తాడు. "అద్వితీయ సత్యదేవుడవయిన నిన్నును, నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము"(యోహాను 17:3) "అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక ఒకనివలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగున నమ్మగలరు?... మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు" అని యూదులతో అంటాడు.(యోహాను 5:44)
ఆ అద్వితీయ దేవుడు ఎలాంటి వాడు? "మీరు ఏ కాలమందైనను ఆయన శబ్దము వినలేదు. ఆయన స్వరూపము చూడలేదు" అని ఏసు యూదులతో చెబుతాడు(యోహ్ను 5:37) పౌలు కూడా ఈ విషయమై సాక్షమిస్తున్నాడు: "శ్రీమంతుడును అద్వితీయుడువగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను(క్రీస్తు తిరిగిరావటాన్ని) కనపరఛును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. ఆయన మాత్రమే దురవగాహమైన తేజస్సులో వసించుచు అమరత్వముగల వాడై యున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు"(1 తిమోతీ 6:15,16).
అద్వితీయుడు అంటే? ద్వితీయుడు లేనివాడు. "దేవుడు ఒక్కడే"(1 తిమోతీ 2:5; గలతీ3:20) ఆయన ఎవరికి దేవుడు? "దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకును దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.దేవుడు ఒక్కడే"(రోమా 3:29).
లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలనబడినవారు, ప్రభువులన బడినవారు అనేకులున్నారు. ఆకాశ మందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన మూలముగా సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. (1 కొరింథీ 8:4-6)
"యెహోవాను నేనే. ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్థోత్రమును విగ్రహములకు చెందనియ్యను"(యెషయా 42:8)
దేవుని ఏకత్వానికి సంబందించిన విషయాలు బైబిలులో కొల్లలుగా కనిపిస్తాయి. ఆయన స్థానంలో మరొకరిని చేర్చటం బైబిలు ప్రబోధానికి విరుద్దం. " నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు" అనేది మోషే కిచ్చిన పది ఆజ్ఞలలో మొదటిది(నిర్గమ 20:3)
"ఇదిగో నేను నేనే దేవుడను. నేను తప్ప వేరొక దేవుడులేడు. మృతినొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడునులేడు"(ద్విత్శ్ 32:39).
ఈ అద్వితీయ దేవుడినే ఏసు వేడుకుంటాడు.
శిలువపైనుండి "నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి?"(ఏలీ, ఏలీ, లామా సబక్తానీ)
అని కేకవేస్తాడు(మత్తయి 27:46) ఈ "ఏలీ' అనే పదం దేవునికి సంబంధించింది. అది హెబ్ర్రూలో "ఎలాహ్"(బహువచనం). ఏక వచనంలో చెప్పాలంటే అదే ఇలాహ్(అల్+ఇలాహ్=అల్లాహ్The God )
స్కోఫీల్డు బైబిల్లో ఇలాహ్ (అల్లాహ్) అనే పదం ఇదివరకు ఉండేది.ఏసుక్రీస్తు దేవుడిని అల్లాహ్ అని పిలిచి ఉండవచ్చు. లేక హెబ్రూలో ఎలాహ్ అనే పదానికి అరబ్బీలో ఇలాహ్ తగిన పదం అయి ఉండవచ్చు.
అయితే ఈ ఏసుక్రీస్తు ఎవరు?"దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు"(1 తిమోతీ 2:5). ఆయన మధ్య వర్తిత్వం ఎలాంటిది? 'మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తికాడుగాని దేవుడొక్కడే'(గలతీ 3:20). అంటే ధర్మశాస్త్రాన్ని తెచ్చిన మోషేలాంటి మధ్యవర్తిత్వమే ప్రజలకు దైవ సందేశాన్ని మోసుకు రావటం అంటే మధ్యవర్తిత్వం గాక మరేమిటి? దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ప్రవక్త ఉంటాడు. అయితే ప్రవక్త పాపాలు క్షమించజాలడు. ప్రజలను గురించి వేడుకుంటాడు. ప్రవక్త దేవుని స్థానాన్ని ఆక్రమించలేడు. మరొకరి పాపాలకు తాను బలికాలేడు. దేవుడు ఎవరి పాపాన్ని గురించి వారినే ప్రశ్నించి శిక్ష విధిస్తాడు. అందరి పాపాలు తీసికెళ్ళి ఒక వ్యక్తిపై అన్యాయంగా మోపి అతన్ని బలిచేసి తృప్తిచెందడు. బలులు పాపాలను పోగొట్టవు.అల్లాహ్ ను, ఆయన ప్రవక్తల్ని నమ్మండి (దివ్యఖుర్ఆన్-3:179)
విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ ను కాదని ఈ ప్రజలు ఎవరినయితే ప్రార్ధిస్తున్నారో వారిని దూషించకండి--వీరు తమ అజ్ఞానం మూలంగా మితిమీరి అల్లాహ్ నే దూషించగలరు.(దివ్యఖుర్ఆన్-6:108) ఆదాము, అబ్రాహాము, మోషే, ఏసు, ముహమ్మదుల దేవుడే మన అద్వితీయ దేవుడు.అందువలన ముస్లిములు,క్రైస్తవులు ,యూదులు ఆ అద్వితీయదేవునికోసం ఏకంకావాలి.
---- నూర్ బాషా రహంతుల్లా గీటురాయి వారపత్రిక 17.4.1987

దేవుడు ఒక త్రిత్వమా?

"గ్రంధాలు కల ఓ ప్రజలారా! మీ ధార్మిక విషయాల్లో హద్దులు మీరకండి. సత్యాన్ని తప్ప దేనినీ అల్లాహ్ కు ఆపాదించకండి. మసీహ్, మర్యమ్ కుమారుడైన ఈసా, అల్లాహ్ పంపిన ఒక దైవ ప్రవక్త తప్ప మరేమీ కాదు.అల్లాహ్ మర్యమ్ దగ్గరకు పంపిన ఒక ఆజ్ఞ.అల్లాహ్ తరపు నుండి వచ్చి మర్యమ్ గర్భంలో బిడ్డ రూపం దాల్చిన ఒక ఆత్మమాత్రమే. కనుక అల్లాను, ఆయన ప్రవక్తల్ని విశ్వసించండి.."ముగ్గురు దేవుళ్ళు" అని అనటం మానండి. ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడంతగదు,అలాంటి బలహీనతలకు ఆయన అతీతుడు. (నిసా - 171)
ఖురాన్ లోని ఈ మాటలు చదివినప్పుడు నాకు అత్యాశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ వాక్యం గ్రంథం గల యూదులు,క్రైస్తవుల కోసమే.
నిరాధార వాదన
అయితే గ్రంథం గలవాళ్ళు తమ గ్రంథం చెప్పే దాన్ని యధాతధంగా నమ్మితే ఈ "త్రిత్వం" కుప్పకూలిపోతోంది. కాని దురదృష్టవశాత్తు క్రైస్తవులలో 83 శాతం మంది దేవుడు ఒక త్రిత్వమేనని నమ్ముతున్నారు. " ఈ త్రిత్వమనేది సాధారణ క్రైస్తవులకు అర్ధం కాని ఒక సిద్దాంతం. నిజానికి వారి సంఘం వారికేమి బోధిస్తుందో తెలిసికొనే ఆసక్తి కూడా ఎక్కువ మందికి లేదు. నిరూపించలేని ఒక సిద్దాంతాన్ని గతిలేని పరిస్థితిలో నమ్మవలసి రావటం లేఖనానికి విరుద్దం." అంటాడు. జి.ఎల్. జాన్ సన్.
త్రిత్వాన్ని బైబిలు బోధించటం లేదు. అయినా ఏ ప్రయోజనాన్ని ఆశించో కొందరు క్రైస్తవ పండితులు ఈ అర్ధం కాని త్రిత్వం నెలకొల్పారు. లిండ్సెల్, వుడ్ బ్రి డ్ జ్
అనే బోధకులు ఏమన్నా రంటే, " మనిషి మనస్సు త్రిత్వ మార్గాన్ని పూర్తిగా అర్ధం చేసికోలేదు. ఈ మర్మాన్ని పూర్తిగా తెలిసికోవాలని ప్రయత్నం చేసిన వాడికి మతిపోతుంది. కాని ఈ త్రిత్వాన్ని వదిలివేసిన వాడికి ఆత్మే పోతుంది"
హేతువు వెలుగులో
ఈ రకంగా క్రైస్తవులు తమకు అర్ధం కాకపోయినప్పటికీ గత్యంతరం లేక త్రిత్వాన్ని నమ్ముతున్నారు. కాని " సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి" అంటాడు పౌలు. (1 థెస్స5:21). పేతురు కూడా "మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడిగే ప్రతివాడికీ సమాధానం చెప్పటానికి సిధ్ధంగా ఉండండి" అంటాడు.(1 పేతురు 3:15). కాబట్టి దేవుడు త్రిత్వమా కాదా అని నిరూపించవలసిన బాధ్యత క్రైస్తవునిదే. ఆ నిరూపణ ఊహాగానాల మీద, సంప్రదాయాల మీద కాకుండా, నేటికీ క్రైస్తవ సోదరుల చేతుల్లో సజీవంగా నిలిచియున్న దైవ గ్రంధం బైబిలు ఆధారంగానే జరగాలి. అందులో దేవుని సందేశం ఉంది.
'త్రిత్వం' అనే పదం బైబిలులో లేదు. దీనికి రుజువుగా 1 యోహాను 5:7 ను చెబుతారు. కింగ్ జేమ్స్ బైబిలులో మాత్రమే కనబడే వచనం ఇది. "పరలోకంలో" సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు. తండ్రి, వాక్యము, పరిశుద్దాత్మ. వీరు ముగ్గురూ ఒక్కటే" ఈ మాట మరే బైబిలులోను ఉండదు. గ్రీకు మూల ప్రతుల్లో కూడా లేదు. కావాలంటే అన్ని బైబిళ్ళూ పరిశీలించండి. ఇది క్రొత్తగా కలుపబడింది. అంటాడు జాన్ సన్. ఇది నిజమైతే అదే యోహాను వ్రాసిన ప్రకటన గ్రంధం 22వ అధ్యాయం 18,19 వచనాల ప్రకారం కింగ్ జేమ్స్. బైబిలులో ఈ మాట కలిపిన వారికి దేవుడు తెగుళ్ళు కలుగజేయాలి. ఇది నిజం కాకపోతే మిగతా బైబిళ్ళలో ఈ మాట తీసివేసినవారికి పరిశుద్ద పట్టణంలో పాలు ఉండదు. జీవగ్రంధంలో నుండి వారి పేర్లు తీసివేయబడతాయి. క్రైస్తవులు ఇందులో దేనికి ఒప్పుకుంటారు? దేనికో ఒక దానికి వారు ఒప్పుకోక తప్పదు.
త్రిత్వానికి అంకురార్పణ
యూదులు "దేవుడు ఒక్కడే" అని నమ్మేవారు. " నేను దేవుని కుమారుడ్ని" అని ఏసు చెబితే దానిని దైవ దూషణగా భావించి ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపబోయారు కూడా(యోహాను 10:33) ఆర్తడాక్స్ యూదులు ఎన్నటికీ ఏసు మెస్సయా అని ఒప్పుకోరు. హేస్టింగ్స్ ఇలా వ్రాశాడు: "హిందూమతంలో బ్రహ్మ, విష్ణువు, శివుడు అని ఒక త్రిత్వం ఉంది. ఈజిప్టు మతంలో ఒసిరిస్, ఇసిస్, హారస్ అనే త్రిత్వం ఉంది. మధ్య క్రైస్తవయుగంలో తండ్రి, తల్లి, కుమారుల చిత్రపటాలు ఉంచేవారు."
మరి తండ్రి, కుమార, పరిశుద్దాత్మలతో కూడిన ఈ త్రిత్వం ఎప్పుడొచ్చింది? మెక్లంటాక్ మాటల్లో చదవండి:- "2 వ శతాబ్దంలో యూదు మతంలోంచి, అన్యమతాలలోంచి, చాలామంది విద్వాంసులు క్రైస్తవ మతంలోకి వచ్చారు. వస్తూ వస్తూ వారు ప్లేట్లో గారి ఆలోచనలను తెచ్చారు. క్రీస్తు మరణానంతరం 300 ఏళ్ళ తరువాత 4వ శతాబ్దంలో మాత్రమే- త్రిత్వ సిద్దాంతం బాగా బలపడింది. మొదటి శతాబ్దంలో లేనేలేదు. రోమన్ కాథలిక్ మతం త్రిత్వానికి బాగా పునాది వేసింది. క్రీ..శ. 325లో బితూనీయలోని నైసియాలో, కాన్ స్టాంటైన్ చక్రవర్తి ఒక సభ జరిపాడు. సిద్దాంత బేధాలతో చీలిపోయిన సంఘాన్నిఒకటిగా చేసి క్రైస్తవుల మద్దతు పొందజూచాడు. సభ ఏరియస్, అతనేసియస్, అనే ఇద్దరు పండితుల వాదాలతో చీలిపోయింది. ఏరియస్ వాదమేమంటే "క్రీస్తు దేవుడు కాదు సృజింపబడిన ఒక వ్యక్తి" అతనేసియస్ వాదం ఏమిటంటే " తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ముగ్గురూ ఒక్కరే" చివరికి ఏరియస్ ను సభ నుండి వెలివేశారు. అతనేసియస్ వాదం నెగ్గింది. అదే వేదం అయ్యింది కాని వివాదం అంతం కాలేదు. సిద్దాంత భేదాలతో క్రైస్తవులే ఒకరినొకరు చంపుకొన్నారు. రోమా చక్రవర్తులందరూ కలిసి కూడా ఇంతమంది క్రైస్తవులను చంపలేకపోయారు. అయిదు సంవత్సరాలపాటు ఆగకుండా ఈ హత్యాకాండ కొనసాగింది" ఆ విధంగా హింస ద్వారా అధికారం ద్వారా త్రిత్వం నమ్మించబడింది ఆ మేరకు లేఖనం మార్చబడింది.
దేవుడు ఒక్కడే
అసలు ఇప్పటికీ మన చేతుల్లో ఉన్న బైబిలు ప్రకారం చూచినా త్రిత్వం ఒక కట్టుకధ మాత్రమే అని తేలుతుంది. త్రిత్వం మాయలో పడి లేఖనంలోకి తొంగి చూడని వారు, త్రిత్వంలోని మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మను తొలగించి ద్విత్వాన్ని మాత్రమే నమ్మేవారు. అద్వితీయుడైన దేవుడ్ని నమ్ముతూనే తండ్రీ కుమారులిద్దరూ ఒక్కరేనని నమ్మేవారు... ఇలా క్రైస్తవ్యం వందలాది చీలికలై పోయింది. అందుకు కారణం ఏమిటి? ప్రతి డినామినేషన్ తన వాదానికి ఆధారంగా బైబిలులోని వాక్యాలనే ఎత్తిచూపుతున్నది. పరస్పర విరుద్దమైన, అపోహలకు, అపార్ధాలకు తావిచ్చే అనేక అంశాలతో బైబిలు నిండి వుంది. " దేవుడు ఒక్కడే" అని బైబిలులో ఎన్నోసార్లు మనకు కనిపిస్తుంది. మరి దేవుడు ఒక్కడే అయితే మేము ఇద్దరము లేక ముగ్గురము అనే మాట ఆయన తన గ్రంధములో చెప్పాడు. చెప్పకూడదు కూడా. మాటాలు మార్చే దేవుడ్ని, మరికొందరిని తన మహిమలో భాగస్థులుగా చేసికొనే దేవుడ్ని మనం నమ్మగలమా?
త్రిత్వంలోని అద్వితీయుడైన, తండ్రియైన దేవుడ్ని మనం నిశ్చింతగా అంగీకరించగలం. అయితే సమస్యల్లా కుమారుడైన దేవుడు, పరిశుద్దాత్మ దేవుళ్ళ దగ్గరే వస్తూ ఉంది, ఈ దేవుడైన ఏసు ఎవరు? దేవుడే మనిషిగా వచ్చాడా? లేక దేవుడీ మనిషిని తన కుమారునిగా ఎన్నుకున్నాడా? లేక కన్నాడా? మరి ఆ పరిశుద్దాత్మ దేవుడెవరు? పరిశుద్దాత్మ అంటే ఆయన ఒక ఆత్మా లేక వ్యక్తా లేక శక్తా? బైబిలు ప్రకారమే అయితే కొన్ని లేఖనాలను తీసికొని " అవును" అని చెప్పవచ్చు. దృఢంగా అద్వితీయ దేవుని గురించి బోధిస్తూ నిలబడవలసిన గ్రంధం కొందరి స్వంత భావాల చొప్పింపు వలన వంగిపోయింది. నిశ్చయంగా బైబిలులో దేవుని ఉద్దేశం స్పష్టంగా నేటికీ వెల్లడవుతూనే ఉంది. అబ్రాహాము నమ్మిన దేవుడ్ని పలచబరిచే వాక్యాలు ఆ దైవ గ్రంధంలో చేరాయి. ఇప్పుడు " త్రిత్వం" లోని మిగతా ఇద్దరి గురించి వివరంగా చూద్దాము. అది కూడా బైబిలు ఆధారంతోనే:-
క్రీస్తుకు పూర్వం 600 ఏళ్ళ క్రితం దాని యేలు దర్శనంలో " ఆకాశమేఘారుడుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహా వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడటం" చూచాడు. (దాని యేలు 7:13), సకల జనుల మీద ప్రభుత్వం, ఆధిపత్యము, ఆయనకివ్వబడినవి.(దాని 7-14). ఏసుక్రీస్తే దేవుడయితే ఆయన సన్నిధికి వెళ్ళటం కుదరదు. దేవుని సన్నిధికి కొనిపోబడిన వారిలో ఏసుక్రీస్తు, ముహమ్మదు ప్రవక్త ఇద్దరూ ఉన్నారు. మరి ఈ మనుష్య కుమారుడు క్రీస్తే అని బైబిలులో ఉంది. మనుష్య కుమారుడు దేవుని కుమారుడు, దేవుడు ఎలా అవుతాడు?
తండ్రియైన దేవుడు, క్రీస్తు, పరిశుద్దాత్మ " ముగ్గురూ కూడా ఏసే" అనేవాళ్ళు కొందరూ, "వాళ్ళంతా వేరే వేరే" అనే వాళ్ళు కొందరు. అయితే బైబిలు ఏమంటున్నది? పరలోకంలో తండ్రి మాట్లాడుతుంటే. పరిశుద్దాత్మ పావురంలాగా ఆకాశం నుండి దిగివస్తుంటే, ఏసు అదే సమయంలో బాప్తిస్మం పొందినట్లు మత్తయి సువార్త 3:16,17 లో ఉంది. ఏసు తనకుతానే ప్రార్ధించుకోకుండా దైవాన్ని ప్రార్ధిస్తాడు(లూకా 6:12) తాను వెళ్ళి తండ్రి ఆదరణకర్తను పంపేలా వేడుకుంటానన్నాడు.(యోహాను 14:26).
"అద్వితీయ సత్యదేవుడవైన నిన్నూ, నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము" అని ఏసు అంటాడు(యోహాను 17:3). త్రిత్వంలోని ముగ్గురూ ఏసే అయ్యేటట్లయితే ఏసు సిలువ మీద చనిపోయి, మూడు రోజులు సమాధిలో ఉన్నప్పుడూ " దేవుడు కూడా" చనిపోయి లేచినట్లే" ఆ మూడు రోజులపాటు దేవుడు లేకుండానే ప్రపంచం మనగలిగిందా?
దేవుడు అద్వితీయుడైతే ఈ ద్వితీయుడు ఎవరు?
ఇక పరిశుద్దాత్మ అనేది ఒక వ్యక్తో, శక్తో అర్ధం కానంత అయోమయం క్రైస్తవులను ఆవరించింది. వాస్తవానికి అది పురుష లింగం కాని స్త్రీ లింగంకాని, కాక నపుంసక లింగమై వుండాలని కొందరి వాదన. పాత నిబంధనలోని "ఆత్మ" స్త్రీలింగంలో చెప్పబడింది. దైవత్వంలోని ముగ్గురిలో ఆత్మ స్త్రీయేనని కొందరన్నారు. అందుకే తండ్రి, తల్లి, కుమారుడు వెలిశారు. చివరికి ఈ నవీన త్రిత్వవాదులు వారిని ఖండించి తల్లిగా పిలవబడే ఆత్మ పురుషుడేనని అన్నారు.
బైబిలు ప్రకారం పరిశుద్దాత్మ దేవుని శక్తి(జెకెర్యా 4:6, మీకా 3:8). అది ఒక వరం(అపోకార్య 2:38). అది క్రుమ్మరించబడుతుంది.(అపోకార్య 2:17; 10:46). దానిని ప్రజ్వలింపజేయవచ్చు. ఆర్పివేయవచ్చు(మోతిజే 1:7;1 థెస్స 5:19) అది పుట్టించే దేవుని జీవశక్తి(మత్తయి 1:18; రోమా 3:9-11) వ్యక్తి అయితే ఈ పనులు సాధ్యం కావు.
పౌలు కూడా త్రిత్వాన్ని గుర్తించలేదు,"
మన తండ్రి అయిన, దేవుని నుండియు, ప్రభువైన ఏసు క్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగుగాక" అని తాను వ్రాసిన లేఖనాలన్నింటిలోనూ పౌలు ముందుగా వ్రాశేవాడు. మరి దేవుడొక త్రిత్వమయితే పరిశుద్దాత్మను పౌలు వదిలేశాడేమి? త్రిత్వం నిజమయితే ఇది దైవదూషణే. ఇలాంటి మాయత్రిత్వంలో మనం మునిగిపోయి. "అద్వితీయ దేవుడ్ని" గుర్తించకూడదనే షైతాను ఈ సిద్దాంతాన్ని లోకంలో వ్యాపింపజేశాడు. వాడి జాలం నుంచి బయటపడలేనంత అజ్ఞనంలోకి పండితులు వెళ్ళిపోయారు.
సత్యం కోసం మన సంకుచిత భావాలను ఇప్పటికైనా వదిలి కళ్ళు తెరిస్తే ఒక్కడయిన " ఆ దేవుడే" కనిపిస్తాడు. ఆ దేవుడు మానవాళి కోసం పరితపించిన దేవుడు. " నా దగ్గరకు రండి, నేనే మీ పోషకుడ్ని, మీ కోసం పరలోకం ఉంచాను" అని పదే పదే ప్రవక్త లను పంపిన దేవుడు. ఆయనకు బదులు మరొకరిని ఆరాదిద్దామా? యాకోబు సంతానమయిన ఇశ్రాయేలీయులు దేవుని విషయమై నిబంధన చేసి ఎన్నోసార్లు ఈ విషయామై తప్పిపోయారు. దేవుడు తనను వదిలి మరొకరిని ఆరాధించినవారిని "వ్యభిచారులు" అన్నాడు. ఏ భర్త అయినా వ్యభిచారము చేసిన భార్యను క్షమించి కాపురం చేయ నిష్టపడగలడా? నన్ను విడిచి విగ్రహారాధన వైపు మళ్ళిన మిమ్మల్ని నేను ఎన్నోసార్లు క్షమించి స్వీకరించాను. నా కరుణా స్వభావాన్ని మీరు చులకనగా ఎంచారు అన్నాడు దేవుడు ఇశ్రాయేలీయులతో.
త్రిత్వవాదుల గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు?
"మర్యం కుమారుడైన మసీహే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా తిరస్కారానికి పాల్పడ్డారు. వాస్తవానికి మసీహ్ అన్నాడు,"ఓ ఇస్రాయీలు సంతానమా! అల్లాహ్ ధాస్యం చెయ్యండి. ఆయన నాకూ ప్రభువే. మీకూ ప్రభువే. ఎవరయితే ఇతరుల్ని అల్లాహ్కు భాగస్వాములుగా చేస్తారో వారికి అల్లాహ్ స్వర్గం నిషిద్దం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించే వాడెవ్వడూ లేడు."అల్లాహ్ ముగ్గురిలో ఒకడు" అని అన్నవారు నిశ్చయంగా తిరస్కారానికి పాల్పడ్డారు.వాస్తవమేముటంటే ఒకే దైవం తప్ప ఏ దైవమూ లేడు. వారు తమ ఈ మాటల్ని మానుకోకపోతే,తిరస్కారానికి ఒడిగట్టిన వారికి వృధాభరితమైన శిక్ష పడుతుంది. ఐతే, వారు అల్లాహ్ సమక్షంలో తౌబా(పశ్చాత్తాపం-మరలుట) చేసుకోరా? క్షమించమని ఆయన్ని వేడూకోరా? అల్లా అమితంగా మన్నించేవాడు, కరుణించే వాడూను. మర్యమ్ పుత్రుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడూ. ఆయనకు పూర్వం కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి ఒక సత్యవతి. వారు ఉభయులూ భోజనం చేసే వారు--చూడండి! మేము ఏ విధంగా వీరి ముందు సత్యానికి సంబంధించిన సూచనల్ని విశదీకరిస్తారేమో చూడండి! తరువాత వారు వెనక్కి తిరిగి ఎటు పోతున్నారో! వారితో అనండి,"ఇదేమిటి, మీరు అల్లాను వదిలి మీకు నష్టం కాని, లాభంగానీ కలిగించే అధికారంలేనిదాన్ని ఎందుకు పూజిస్తారు? అందరిదీ వినేవాడు అంతా తెలిసిన వాడైతే అల్లాహ్ మాత్రమే". "గ్రంధం కల ఓ ప్రజలారా! మీ ధర్మంలో అధర్మంగా హద్దులు మీరకండి. మీకు పూర్వం స్వయంగా తామూ మార్గభ్రష్టులై, ఇంకా చాలా మందిని మార్గభ్రష్టులుగా చేసి, ఋజుమార్గం తప్పిన వారి భావనల్ని అనుసరించకండి" అని చెప్పండి( అల్ మాఇద: 72-76)
నీవు అల్లాహ్ తో పాటూ మరొక ఆరాధ్యుణ్ణి చేసుకోకు(ఖురాన్-17:22)
తెలుసుకోండి! ఆకాశాల్లో ఉండేవారైనా, భూమిలో ఉండేవారయినా సర్వులూ అల్లాహ్ పాలితులే. ఎవరయితే అల్లాను కాదని(తమ స్వకల్పితమైన) కొందరు భాగస్వాముల్ని వేడుకుంటున్నారో, వారు కేవలం భ్రమను, అనుమానాన్ని అనుసరిస్తున్నారు(ఖురాన్:10:66)
----- నూర్ బాషా రహంతుల్లా ( గీటురాయి 8.5.1987)