ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, మే 2010, శుక్రవారం

బాసరాని సాయిబులు

బాసరాని సాయిబులు
గీటురాయి వారపత్రిక 30.4.2004
దూదేకుల సిధ్ధప్ప (బ్రహ్మం గారి శిష్యుల్లో మహాజ్ఞాని)కి దూదేకను రాదంటే లోటా? అని సామెత. ఆయనకి దూదేకటం రాకపోయినా ఆయన గురువుగారి కాలజ్ఞాన తత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడూ కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు(కంసాలీలు/విశ్వబ్రాహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ బాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసం దాన్నొక లోటుగా కూడా ఎంచలేదు.ఆయన మాత్రం "ముట్టున బుట్టిందీ కులము, ముట్టంటున పెరిగిందీ కులము" అని తెలుగు తత్వాలే పాడాడు.

లింగి పెళ్ళి మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు పెట్టుకొని సంఘంలోకెళితే,అసలు సిసలు సాయిబు(ఉర్దూ జబర్దస్తీగా మాట్లాడే మహారాజు) ఎదురైనపుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది.ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా పోతున్నారు మీరు అని అసలు సాయిబులు ఆవేదన చెందుతూ ఉంటారు.ఆకారం చూచి ఆశపడ్డామేగాని అయ్యకు అందులో పసలేదని చప్పడిస్తుంటారు.బాష వేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖాన అంటావు. నేను అన్నం అంటాను అంటాడు. ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదై పోతాడు.

ఇటీవల "పింజారీ వెధవ" అనే తిట్టు టీ.వీ. సీరియళ్ళలో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది. బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల "పింజారి" అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో బాధపడుతున్న సంభాషణా రచయితలున్నారు. "ఓరీ రజక చక్రవర్తీ" అంటే - ఇంత పెద్ద పేరు మాకందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట. అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. "ఎస్సీ,ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం" వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు. ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడల్లాగా వాళ్ళు కూడా మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూడటమే మిగతా వారి వంతయ్యింది. ఐతే ఆ తోకలతో పిలవచ్చా పిలువ కూడదా, పిలిస్తే ఏమవుతుందో అనే భయంతో మిన్నకున్నారు. ఒకనాడు అవమాన సూచికగా, తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్దార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించుకుంటుంది. అలాగే బాసరాని పింజారులు కృంగిపోవద్దు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ పవిత్రమైన ఆశయాలతో కృషి చేస్తే, పది మందికి వెలుగు చూపే చక్రవర్తులుగా "నూర్ బాషా"లు(కాంతిరాజులు) గా మన్నన పొందుతారు.--- గీటురాయి వారపత్రిక 30.4.2004.

ఈదేశానికి పట్టిన చీడ కులం.మాటవరసకు ఒకవేళ కులం జన్మనుబట్టే వస్తుందనుకుందాం.దూదేకులవాళ్ళు వచ్చేజన్మలో ఇంకో కులంలో పుట్టొచ్చు.అనేక కులాల వాళ్ళు దూదేకులుగానూ పుట్టొచ్చు.ఇన్ని జన్మల క్రమంలో కులదూషణకు,ఎగతాళికి పాల్పడినందుకు ఎన్ని వేలమంది జంధ్యాలలు పింజారులుగా పుట్టి ఉంటారో?.అలాగే ఎన్ని వేలమంది పింజారులు అగ్రకులాల్లో పుట్టి ఉంటారో?సంఘమిలా ఏనాడో సంకరమైపోయిఉన్నా కూడా దౌర్భాగ్యం ఏంటంటే భారతీయుడు ఏ మతంలోకి వెళ్ళినా కులం ఉంటున్నది.భారతీయ క్రైస్తవుల్లో,ముస్లిముల్లో కూడా కులాలున్నాయి.అగ్ర కుల ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వకపోయినా షేక్ ల రూపంలో దొంగదారిన రిజర్వేషన్ పొందుతున్నారు.పేదరికమే ఈ కక్కుర్తికి కారణం.రిజర్వేషన్ ఇచ్చిన 14 కులాలూ నికృష్టంగానే ఉన్నాయి.అసలు దూదేకుల వాళ్ళ మాట ఎక్కడ చెలామణి అవుతుంది?ఈరాష్ట్రంలో దూదేకుల వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.బి.సి.ఇ గ్రూపులో దూదేకుల కులస్తులను కలపలేదు.వాళ్ళు బి గ్రూపులో ఉన్నారుగా అని వదిలేశారు.అధికారులు కూడా కొన్నిప్రాంతాల్లో మతం హిందూ అనీ, కులం దూదేకుల అని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇస్లాం-దూదేకుల అని సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. మసీదుకు వెళ్ళము అని అఫిడవిట్ దాఖలు చెయ్యాలని ఆంక్షలు పెడుతున్నారు. తల్లిదండ్రులు దూదేకుల వృత్తి చేస్తుంటేనే బీసీ సర్టిఫికెట్‌ ఇస్తామని చెబుతున్నారు.రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కాలంలో అసెంబ్లెలోనే విన్నవించింది.అంటే దూదేకుల వారిని ముస్లిములు దళితులుగా భావిస్తున్నట్లేగా?

ఆ మధ్య ఓ కాపులామెను ఇంట్లో పిండి దంచటానికి రమ్మంటే తురకోళ్ళ ఇంట్లో పని చెయ్యనని తిరస్కరించింది. సరే, కూలి పని చేసుకునే ఈ కాపులామె దృష్టిలో తురకసాయిబులు సంపన్నులైనా అంటరాని వాళ్ళు కాబోలులే అనుకొని అవసరం మరొకరి చేత తీర్చుకున్నాం. ఇంకోచోట అప్పటిదాకా సాలీలకు అంట్లుతోమిన ఓ తురకసాయిబులామె మాకు తోమను పొమ్మంది. మేము తక్కువ రకం సాయిబుల మట. మా ఇంట్లో కూలిపని చెయ్యటం తప్పట! ఆయనగారు జిల్లా కలెక్టర్ అయినా సరే వాళ్ళిచ్చే కూలీ నా కొద్దు చాకలోళ్ళ ఇంట్లో అయినా పని చేస్తాను గానీ దూదేకుల వాళ్ళింట్లోపని చెయ్యను అని తెగేసి చెప్పింది. సరే, ఇక చేసేదేముంది? మా పనులు మేమే చేసుకుంటున్నాం. ఉర్దూ రాని దూదేకుల వాళ్ళ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా వుంది.రజక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య, చాకలి వాళ్ళు తన ఇంట్లో బట్టలు ఉతకటానికి నిరాకరించారని గతంలో వాపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఇది స్వంతకులంలోనే అంతర్గత సమస్య.పరిస్థితి ఇలా ఉంది. తల పండిన పెద్దలు, పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

కొన్నేళ్ళక్రితం  మా అపార్ట్ మెంట్లోకి ఒక సాయిబుల కుటుంబం చేరింది.మాది పొదిలి అంటూ మంచిగా మా ఆవిడను పరిచయం చేసుకుంది. మాయింటి పేరు నూర్ బాషా అని తెలియగానే ఆవిడ ముఖం రంగు మారి పోయింది.”వాళ్ళు వేరు మేము వేరు ” అని పని గట్టుకొని అందరికీ చెప్పింది.”ఇద్దరూ సాయిబులేగా” అంటే “కాదు మేము తురకసాయిబులం వాళ్ళు దూదేకుల సాయిబులు, వాళ్ళకు ఉర్దూ రాదు మాకు ఉర్దూ వచ్చు, వాళ్ళకు మాకు చాలా తేడా వుంది” అని చెప్పిందట.విశాఖపట్నంలో ఇంత నాగరికత గల ఊళ్ళో ఈనాడు ఈ కుల ఫీలింగ్ ఉండదు అన్న నాభావన కరిగిపోయింది.ఆవిడ కొడుకు ఒక డాక్టర్ .కేరళ క్రిస్టి యన్ నర్సును ఆదర్శ వివాహం చేసుకొన్నాడు.ఆయనకు లేని కులం పట్టింపు ఈమెకుంది.పక్క అపార్ట్ మెంట్ లోని సాయిబులామె అప్యాయంగా కలుపుకొని పలకరిస్తుంటే ,ఈమె కులం కోసం బిగుసుకు పోతుందేమిటీ? ఈమెకేమయ్యిందీ?అనుకునేవాళ్ళం.
కొన్ని రోజుల క్రితం చీరాల నుండి మా చుట్టాల్లో ఒకామె వచ్చింది.ఇద్దరూ చాలా సేపు ఆప్యాయంగా ఉర్దూలో మాట్లాడుకున్నారు.చివరికి మా చుట్టం “పొదిలావిడ మన కులమే .ఆవిడ మాకు చుట్టం” అని తేల్చింది.
అరెరే, మాకులం దానివై వుండీ,క్రిస్టియన్ కోడలిని పెట్టుకొనీ ,తురక సాయిబులమంటూ ఎంత పోజు కొట్టావే ముసలమ్మా అనుకొన్నాం.ఈ చేదు అనుభవాలను చాలా మంది ఎదుర్కొని ఉంటారు. నేటికీ సమాజంలో కొనసాగుతున్న ఈ రుగ్మతల పట్ల సంఘ సంస్కర్తలు శ్రద్ధ చూపడం అవసరం. 

దూదేకుల సాయిబులను కూడా ముస్లిములుగా అంగీకరించటానికి ఉర్దూసాయిబులు  క్రమంగా అంగీకరిస్తున్నారు.ముస్లిం అనే పదం అల్లాను దేవునిగా అంగీకరించిన వారందరికీ సమానంగా వర్తిస్తుంది కానీ ఆంధ్రాలో ముస్లిం అంటే తురకం రావటమే ప్రధాన అర్హత అన్నట్లుగా పరిస్థితి ఉంది.ఏలూరు దగ్గర తంగెళ్ళమూడిలో తురకసాయిబులు తివాచీలు నేస్తారు.అక్కడికి ఓ ముస్లిం మిత్రునితో కలిసి వెళ్ళాను.అప్పటిదాకా ఎంతో ఆప్యాయతగా మాట్లాడిన ఓ తివాచీల పెద్దాయన నేను దూదేకుల ,నూర్ బాషా అని తెలియగానే నన్ను  అంటరాని కులం వాడిలాగా చూడడం మొదలుపెట్టాడు.నన్ను అక్కడకు తీసికెళ్ళిన మిత్రుడు అతని ప్రవర్తనచూసి బాధపడి నాకు క్షమాపణ చెప్పాడు.

దూదేకుల సాహెబుకు రైల్లో ప్రయాణించేటప్పుడుకుడా నమాజు చేసేంత భక్తి ఉండటంలేదని తురక సాయిబులకు అసంత్రుప్తి.ఇస్లాం విశ్వాసాలనూ హిందూ విశ్వాసాలనూ  ఒకేరీతిగా చూస్తాడనీ ,హిందువులాగా బొమ్మలకీ..రాళ్ళకీ రప్పలకీ కూడా మొక్కుతాడనీ బాధపడతాడు,విమర్శిస్తాడు.ఫలితంగా 'సాహెబ్' అనే గౌరవనామానికి తురకమొచ్చిన సాయిబులే తప్ప తెలుగు మాత్రమే వచ్చిన దూదేకుల సాయిబులు పనికిరావటం లేదు.ఇనగంటి దావూద్ గారు నూర్ బాషీయుల చరిత్ర రాసి కొంత మేలుకొలిపారు. తెలుగుముస్లిం అనే వాదం బలపడ్డాకనే దూదేకులకు ఉర్దూ సాయిబుల్లో కొంత గుర్తింపు వచ్చింది. అంతర్గత వివక్ష పోయేందుకు ఇరుపక్షాలు కృషిచెయ్యాలి.
ఉర్దూవచ్చినవాడే సాహెబు అనే స్థితినుండి ఇస్లాంను తెలుగులోకి తరలివచ్చేలా చేసిన తెలుగువాడు దూదేకుల సాహెబు.ఉర్దూ భాషరాదనే ఈసడింపులను సహించాడు.మసీదులోకి తెలుగును తీసికెళ్ళాడు.అందుకే అతను తెలుగు ముస్లిం అయ్యాడు.ఇతన్ని బాసరాని సాయిబుగా విడదీసి చూస్తారు.వీళ్ళని మంచి ముస్లిములుగా చెయ్యాలని ముస్లిం సంస్థలు కృషి చేస్తుంటే,ఇన్నాళ్ళూ అద్దె ఇళ్ళలో ఉన్నారు తిరిగి మీసొంత ఇంటికి రండి అని హిందూ సంస్థలు పిలుపునిస్తున్నాయి.

15 కామెంట్‌లు:

  1. పింజారీ అంటే పింజలు జంద్యాలు వడికేవాడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html

    రిప్లయితొలగించండి
  2. sir chala bavundhi memu kuda mee kulame maadhi visakapatnam evaina charchalu sabalu jarigithe konchem theliyajeyagalaru

    రిప్లయితొలగించండి
  3. https://www.facebook.com/akbarali.dudekula/posts/2277665755591501?comment_id=2277881798903230&notif_id=1536908613516555&notif_t=feed_comment_reply

    రిప్లయితొలగించండి
  4. దేశంలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య 5-6% ఉంటుంది: ఇందులో సింహభాగం ముస్లిములే అయినా ఇతరులు (ఉ. కాయస్తులు) కూడా ఉంటారు.

    భారత జనాభాలో దాదాపు 15% ముస్లిములు. ఈ రెండు గణాంకాలను కలిపి చూస్తే భారత్ ముస్లిములలో మూడో వంతు మందికి మాత్రమే ఉర్దూ మాతృభాష.

    రిప్లయితొలగించండి
  5. ఒరిస్సాలో కూడా చాలా మంది ముస్లింలకి ఉర్దూ రాదు. రాయగడ పట్టణంలో అయితే విజయనగరం నుంచి వచ్చిన ముస్లింలు మాత్రమే ఉర్దూ మాట్లాడుతారు. ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నవాళ్ళకైతే ఉర్దూ రాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒరిస్సా మాత్రమే కాదు కేరళ, తమిళ నాడు, బెంగాల్, ఆంధ్ర & ఆసాం రాష్ట్రాలలో ముస్లిములు చాలామందికి ఉర్దూ రాదు, మా మాతృభాష ఉర్దూ అని చెప్పుకొనే వారి ఉర్దూ కూడా అంత బాగా ఉండదు.

      తొలగించండి
    2. ఒకప్పుడు హైదరాబాద్‌లో కూడా ఉర్దూ లేదు. రెండవ సలార్ జంగ్ కాలం వరకు నిజాం రాజులు పెర్సియన్ భాషలో మాట్లాడేవాళ్ళు. సిపాయిల తిరుగుబాట్లులో దిల్లీ, ఆగ్రా, అవధ్ ప్రాంతాలకి చెందిన ముస్లిం రాజులు ఓడిపోయిన తరువాత వాళ్ళ ఆస్థానాలలో పని చేసి నిరుద్యోగులుగా మారిన ఉర్దూ కవులందరూ హైదరాబాద్ వచ్చేసారు. ఏడవ నిజాం గురువైన జలీల్ మానిక్‌పురీ అటువంటి కవుల కుటుంబానికి చెందినవాడే.

      తొలగించండి
    3. హిందీ, ఉర్దూ దగ్గర దగ్గరగా ఒకేలాగ ఉంటాయి. హిందీవాళ్ళకి కొన్ని ఉర్దూ పదాలు అర్థం కావు. ఉదాహరణకి భర్తని ఉర్దూలో శౌహర్ అంటే హిందీలో పతి అంటారు. ఒరిస్సాలో ముస్లిం అయిన ఒక బొలేరో పికప్ డ్రైవర్‌తొ నేను హిందీలో మాట్లాడినప్పుడు ఆయనకి హిందీ అర్థమవ్వలేదు. ఆయన మాతృభాష ఉర్దూ కాదు, తెలుగే. రాయగడలో ఉన్న ముస్లింలందరికీ తెలుగు వచ్చని ఆయన అన్నాడు. విజయనగరం నుంచి వచ్చి రాయగడలో స్థిరపడిన ముస్లింలు మాత్రం ఉర్దూ, తెలుగు రెండూ మాట్లాడడం చూసాను. పశ్చిమ ఒరిస్సా నుంచి వచ్చిన ముస్లింలకి తెలుగు రాదు. ఆయన గెడ్డం చూస్తే ఆయన ముస్లిం అని తెలిసిపోతుంది కానీ ఆయన ఏ ప్రాంతం నుంచి వచ్చాడో తెలియక ఆయనతో నేను హిందీ మాట్లాడాను. నేను హిందీలో మాట్లాడడం వల్ల నేను వేరే ప్రాంతం నుంచి వచ్చాననుకుని ఆయన మొదట్లో నన్ను బండి ఎక్కనివ్వలేదు.

      తొలగించండి
  6. హిందూ మతంలో కజిన్ మేరెజ్ అనేది వినకూడని పదమే. ముస్లింలు కజిన్ మేరెజెస్ పాటించడాన్ని చూసి హిందువులు నవ్వుతుంటారు కానీ అందులో నవ్వాల్సింది ఏమీ లేదు. వాళ్ళ మతాచారాన్ని పాటించే హక్కు చట్ట ప్రకారం వాళ్ళకి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దూదేకుల అనే కులం ఉంది. ఆ కులంవాళ్ళందరూ ఇస్లాంలోకి మారినవాళ్ళే. ఆ కులంలో చాలా మందికి ఉర్దూ రాదు కానీ డబ్బున్న దూదేకులవాళ్ళు ఉర్దూ నేర్చుకుని ఇతర ముస్లింలకి దగ్గర అవుతుంటారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోని దూదేకులవాళ్ళు ఇప్పటికీ హిందూ మతాచారాలని పాటిస్తుంటారు. హిందువులలాగే వీళ్ళు కూడా కజిన్ మేరెజెస్‌ని పాటించరు. హిందువులలోలాగే వీళ్ళలో కూడా ఒకే ఇంటి పేరుగలవాళ్ళు పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం. వీళ్ళు హిందూ మతాచారాలని నమ్మడం చూసి ఇతర ముస్లింలు నవ్వుతుంటారు. ఈ మధ్య కొందరు దూదేకులవాళ్ళు ప్రధాన స్రవంతి ముస్లింలకి దగ్గర అవ్వడానికి కజిన్ మేరెజెస్ పాటిస్తున్నారు. నేను ఒకప్పుడు కజిన్ మేరెజ్ చేసుకునేవాళ్ళని చూసి నవ్వేవాణ్ణి. వరసలు అనేవి ఒక్కో మతంలో ఒక్కోలాగ ఉంటాయని తెలిసిన తరువాత అలా నవ్వడం మానేసాను.

    రిప్లయితొలగించండి
  7. ఉర్దూ ముస్లిముల సొంత భాషా?సాయిబు అంటే ఉర్దూనే మాట్లాడాలా?

    ఈరోజు ఉదయం కృష్ణా కరకట్ట దిగువన ఉన్న రవిశంకర్ ఆశ్రమం లోజరిగే సుదర్శన క్రియకు వెళ్ళాను.అక్కడ పరిసరాలను శుభ్రం చేసే బేగం అనే ముసలమ్మ నేను సాయిబునని తెలుసుకుంది. దగ్గరకొస్తే బాగున్నావా అమ్మా అని పలకరించాను.నన్ను ఉర్దూలో మాట్లాడమంది.నాకు రాదమ్మా అన్నాను. ఆశ్చర్యపోయింది. సాయిబులకు ఉర్దూ రావాలి,రాకపోతే నేర్చుకోవాలి అంది.తప్పదా?ఎందుకని?అని అడిగాను.ఉర్దూ రాకపోతే మాసాయిబులకింద లెక్కేయ్యరు,సాయిబుల భాష ఉర్దూనే కదా? అని నన్ను ప్రశ్నించింది.
    ఆలాగేం కాదమ్మా,మేము తెలుగు ముస్లిములం,మీకు ఉర్దూ ఎలానో,మాకు తెలుగు అలాగా.తమిళ ముస్లిములు,కన్నడ ముస్లిములు ఇలా ఎన్నో భాషలు ముస్లిములు మాట్లాడుతున్నారు.మన ప్రవక్త మహమ్మదు గారికి అరబ్బీ వస్తాది గానీ ఉర్దూ రాదు. ఉర్దూ మనదేశంలో మాత్రమే ఉంది అన్నాను.

    ఉర్దూ ముస్లిములందరికీ మత భాష ,మాతృభాష అనే తప్పుడు అభిప్రాయం ఇప్పటికీ ఉన్నవారు తమ అభిప్రాయం మార్చుకోవాలి.
    ఉర్దూ సాయిబుల భాష కాదు. ఉర్దూకు మతం రంగు పులమబడింది.వాస్తవానికి ఉర్దూ కూడా తెలుగు లాగానే భారతీయ భాష . పైగా సామాన్యుల వాడుక భాష. హిందుస్తానీ (కారి బోలీ ) భాష.ఇది భారతదేశంలో పుట్టిపెరిగి అభివృద్ధి చెందింది. 1947 వరకు మనదేశంలో రాజ భాష ఉర్దూనే.హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టులో న్యాయ వ్యవహారాలు ఉర్దూలోనే జరిగేవి. న్యాయవాదులు (వకీళ్ళు)వాదనలు ఉర్దూలో చేసేవారు. తీర్పులు ఉర్దూలో వచ్చేవి. ఉర్దూలో న్యాయశాస్త్ర పుస్తకాలు ఉండేవి.రెండు హైకోర్టుల విలీనం వల్ల ఉర్దూ బెంచిని ఏడు సంవత్సరాలు నడిపిస్తామని చెప్పి మధ్యలోనే ఆపేశారు.ఉర్దూను కొందరు ముస్లిములు తమ మత భాషగా వేరుచేసి చెలామణి చేసిన ఫలితంగా ఆ భాష పట్ల వ్యతిరేకత పెరిగింది.ఉర్దూ రానివాళ్ళు ముస్లిములే కాదు అని గతంలో కొందరు ఉర్దూ ముస్లిములు తెలుగు ముస్లిములను చిన్నచూపు చూసేవారు. అయితే క్రమేణా ముస్లిముల మతగ్రంధాలన్నీ తెలుగులోకి దిగి వస్తున్నాయి.ఏ భాషకూ మతం ఉండదు.మతస్తులే ఆయా భాషలను వారి అవసరాల కోసం వాడుకుంటారు.

    రిప్లయితొలగించండి
  8. Nenu dudekula ,telangana lo veellani gurtinchadam chala kastam ,andaru pure muslim acharale patistunnaru,burka compulsory ayyindhi mukham kuda poorthiga cover cheskovali nakaite voopiri this kavadam kastam ga vuntundi,eppudina ala temple kuda vellalani anipistundi assalu vellakudadu,burka veyadam valla hinduvulu matladaru ,poni muslim although matladudamanna ente gurthu Patti baga helanaga chustaru,enduku manam ila rendu kulallo irukku povadam hinduvulame ayte baguntundi kada,nenu AP nunchi kavadam valla veering laga poorthiga vundaleka potunna ,dudekula Hindu ga vundatame melu anipistuntundi endukante minority avakasalu vundavu ,Muslims nunchi Visakhapatnam kuda naku eduraindi ,cinemas velte burkha tho chala ibbandiga vuntundi, nenu telangana lo chusina tarvata muslim adapillaga vunnatlayite higher studies and jobs cheyadam baga kastam .so manavallu muslim paddatulni patinchadam kontavaraku matrame parietal cheyadam manchidiga bavistunnanu .Please reply ivvandi andaru dudekula exam avudam manakantu pratyekatanu chatudam ,manakantu oka special paddatulni pettukoni vatine patinchenduku pracharam chesukundam ,manam evari group cheralsina avasam manaku ledu ,ivvala repu sc st lu kuda manchi jobs lo settle ayyi manchi Hoda lo vuntunnaru,manam kanisam bc lo ayna vunnam kada mana PM kusa B C ne kada ayanaku leni jankutanam mana kenduku .Please manam muslim ga tayaravutu pothe indulge manaku chala ibbandulu eduravutayi

    రిప్లయితొలగించండి